
వనపర్తి, వెలుగు: స్నేహితుడి తమ్ముడి ఐ ఫోన్ను దొంగిలించి పోలీసులకు దొరికిపోయారు. ఏఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వర్ రావుతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గద్వాలకు చెందిన షేక్ అహ్మద్ తమ్ముడు ఇర్ఫాన్ ఈ నెల 26న ఐ ఫోన్ కొనుక్కునేందుకు ఇంట్లో వారికి తెలియకుండా రూ.80 వేలు తీసుకుని విజయవాడ వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న ఇర్ఫాన్ను రైల్వే పోలీసులు ప్రశ్నించి, అతని అన్న అహ్మద్కు ఫోన్ చేసి చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లి మిర్యాలగూడలో ఉండే తన తమ్ముడు నవాజ్కు ఫోన్ చేసి ఇర్ఫాన్ను ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది. ఇదిలాఉంటే తమ్ముడిని తీసుకొచ్చేందుకు అహ్మద్ మిర్యాలగూడకు వెళ్తూ తన స్నేహితుడు రామాంజిని వెంట తీసుకెళ్లాడు.
ఇద్దరు కారులో వెళ్లి ఇర్ఫాన్ను అక్కడే ఉండమని చెప్పి, అతడి దగ్గర ఇన్న ఐ ఫోన్ను తీసుకొని గద్వాలకు బయలుదేరారు. ఎలాగైనా ఐ ఫోన్ను కాజేయాలని భావించిన రామాంజి గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన బంధువు పొడుగు రాజేశ్కు సమాచారమిచ్చి దారిదోపిడీ చేయాలని సూచించాడు. రాజేశ్ తనకు తెలిసిన విజయ్కుమార్, మహ్మద్ సల్మాన్, అశోక్లకు విషయం చెప్పి దారి దోపిడీకి పాల్పడ్డారు.
మినిట్ టు మినిట్ వివరాలు రామాంజి చెబుతుండగా, బుద్దారం నుంచి వనపర్తికి వెళ్లే దారిలో కారును అడ్డగించి అహ్మద్ను కొట్టి అతడి వద్ద ఉన్న ఐ ఫోన్, మరో ఫోన్, రూ.15 వేల నగదు, అనుమానం రాకుండా రామాంజి ఫోన్ను లాక్కున్నారు. ఈ ఘటనపై అహ్మద్ గోపాల్పేట స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి ఐ ఫోన్, మరో మూడు ఫోన్లు, రూ.15వేల నగదు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
కేసును చేధించిన వనపర్తి సీఐ ఎం కృష్ణయ్య, గోపాలపేట ఎస్సై నరేశ్కుమార్, సీసీఎస్ ఎస్సై రామరాజు, సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, నగేశ్, శ్రీనివాస్, ఆంజనేయులు, అభిషేక్, రాజారాం, మౌలనా, మురళిని ఎస్పీ అభినందించారు. తదితరులు ఉన్నారు